హైదరాబాద్‌లోని ఉద్యోగులకు హెచ్ఆర్ఏపై కేంద్ర ప్రభుత్వం తీపికబురు.

  • హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితిని పెంచిన కేంద్ర ప్రభుత్వం
  • 50 శాతం మినహాయింపు జాబితాలోకి హైదరాబాద్, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్
  • ఇప్పటికే జాబితాలో ఉన్న ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా నగరాలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) మినహాయింపును 50 శాతానికి పెంచింది. ఇప్పటి వరకు ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై నగరాలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణించేవారు. దీనితో ఆయా నగరాల్లో హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి 50 శాతంగా ఉంటోంది. తాజాగా ఈ జాబితాలో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, పుణే, అహ్మదాబాద్ చేరాయి.

ఆదాయపు పన్ను నిబంధనలు, 2026ను కేంద్రం నోటిఫై చేసింది. ఆరు దశాబ్దాల పాత ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి రాబోయే కొత్త నిబంధనలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంతో 8 నగరాల్లోని ఉద్యోగులకు తమ వేతనంలో 50 శాతం వరకు హెచ్ఆర్ఏ కింద పన్ను మినహాయింపును పొందవచ్చు. 2027 జులైలో ఫైల్ చేయబోయే రిటర్నుల సమయంలో ఇది వర్తిస్తుంది.

హెచ్ఆర్ఏ మినహాయింపు పొందాలంటే ఇకపై పన్ను చెల్లింపుదారులు తాము నివసిస్తున్న ఇంటి యజమానితో తమకు ఉన్న సంబంధాన్ని తప్పనిసరిగా వెల్లడించవలసి ఉంటుంది. ఫారమ్ 124లో ఈ వివరాలు నమోదు చేయాలి. పార్లమెంటు ఆగస్ట్ 12న కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం తెలిపింది.

HRA
Hyderabad HRA
Central Government
House Rent Allowance
Income Tax
Tax Exemption

More Telugu News